Balochistan: పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ సాయుధుల మెరుపుదాడులు... 15 మంది సైనికుల మృతి

Balochistan Armed Groups Attack Pakistan Army 15 Soldiers Dead
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని వారాలుగా బలోచ్ వేర్పాటువాద సాయుధ గ్రూపులు జరిపిన వరుస దాడుల్లో కనీసం 15 మంది పాకిస్థానీ సైనికులు మరణించారు. ప్రావిన్స్‌లోని కెచ్, పంజ్‌గూర్, తుర్బాత్, సురబ్, నసీరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), బలోచ్ రిపబ్లికన్ గార్డ్స్ (బీఆర్‌జీ) అనే మూడు సంస్థలు ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు సోమవారం స్థానిక మీడియా వెల్లడించింది.

డిసెంబర్ 23న కెచ్ జిల్లాలోని తేజాబన్ ప్రాంతంలో పాక్ ఆర్మీ పోస్టుపై తమ ఫైటర్లు దాడి చేసి ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్ లాంచర్లతో ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 25న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) మార్గంలో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని రిమోట్ కంట్రోల్ బాంబును పేల్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారని వెల్లడించారు. అలాగే, తుర్బాత్‌లో పాక్ సైన్యం వినియోగిస్తున్న కమ్యూనికేషన్ టవర్‌ను ఆదివారం పేల్చివేసినట్లు ‘ది బలూచిస్థాన్ పోస్ట్’ పేర్కొంది.

మరోవైపు, డిసెంబర్ 27న సురబ్ జిల్లాలోని ఆర్‌సీడీ హైవేపై వాహనాలను అడ్డగించి, సైందక్ మైనింగ్ ప్రాజెక్టుకు చెందిన ట్రక్కులకు భద్రతగా వస్తున్న కాన్వాయ్‌పై దాడి చేసినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రకటించింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించినట్లు ఆ సంస్థ ప్రతినిధి మేజర్ గ్వాహ్రామ్ బలోచ్ తెలిపారు. 

నసీరాబాద్ జిల్లాలో శనివారం రాత్రి పాక్ సైనిక కాన్వాయ్‌తో తమ ఫైటర్లకు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మరణించారని బలోచ్ రిపబ్లికన్ గార్డ్స్ (బీఆర్‌జీ) ప్రకటించింది. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చేవరకు ఇలాంటి దాడులు కొనసాగిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.
Go Back to Shorts
Balochistan
Pakistan Army
Balochistan attacks
BLA
BLF
BRG
CPEC
Balochistan conflict
Tejaabun
Gwahrram Baloch

More Telugu News