నూర్‌ ఖాన్‌ బేస్‌పై భారత్ దాడులను బహిరంగంగా అంగీకరించిన పాక్‌

  • మే నెలలో ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై భారత్ దాడులు
  • భారత్ 80కి పైగా డ్రోన్లను ప్రయోగించిందన్న పాక్ ఉప ప్రధాని ఇషాాక్ దార్
  • నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని ఒక డ్రోన్ తాకిందని వెల్లడి

 ఈ ఏడాది మే నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన సైనిక చర్యలు పాక్‌ సైన్యాన్ని తీవ్రంగా కుదిపేశాయని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్‌ చేపట్టిన దాడులు పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర నెట్‌వర్క్‌ను భారత్ ధ్వంసం చేసింది.


ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఒక కీలక అంశాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం తాజాగా అధికారికంగా అంగీకరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భారత దళాలు తమ నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడులు చేశాయని, ఆ దాడిలో స్థావరం దెబ్బతిన్నదని పాక్‌ స్వయంగా ఒప్పుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.


36 గంటల వ్యవధిలో భారత్‌ దాదాపు 80కి పైగా డ్రోన్లను ప్రయోగించిందని ఆయన వెల్లడించారు. వాటిలో 79 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, ఒక డ్రోన్‌ మాత్రం నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరాన్ని తాకిందని తెలిపారు. ఆ దాడిలో సైనిక స్థావరానికి నష్టం వాటిల్లడంతో పాటు, అక్కడి సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని ఆయన అంగీకరించారు. భారత్‌ డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉందో ఈ అంగీకారంతో మరోసారి రుజువైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


రావల్పిండి సమీపంలోని చక్లాలా ప్రాంతంలో ఉన్న నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం పాకిస్థాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఇది పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి, రాజధాని ఇస్లామాబాద్‌కు అతి సమీపంలో ఉంది. అలాంటి కీలక స్థావరాన్ని భారత్‌ లక్ష్యంగా చేసుకోవడం పాక్‌ భద్రతా వ్యవస్థలపై గట్టి ప్రభావం చూపిందని భావిస్తున్నారు.


మొత్తానికి, పాక్‌ అధికారికంగా చేసిన ఈ ప్రకటన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్టయింది. ఉగ్రవాదానికి గట్టి సందేశం ఇవ్వడంలో భారత్‌ ఏమాత్రం వెనుకడుగు వేయదన్న విషయాన్ని ఈ దాడులు స్పష్టంగా నిరూపించాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



More Telugu News