Nara Lokesh: "ఆంధ్రా ఆత్మకు ప్రతిబింబం".. అరకు అందాలపై మంత్రి లోకేశ్ పోస్ట్, నెటిజన్ల స్పందన

Araku Valley Photos Shared by Nara Lokesh Captivate Netizens
  • అరకు లోయ అందాలపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా పోస్ట్
  • ప్రముఖ ఫొటోగ్రాఫర్ తీసిన గిరిజన మహిళ చిత్రాన్ని పంచుకున్న వైనం
  • ఆంధ్రా ఆత్మను ఆవిష్కరించిన చిత్రమంటూ లోకేశ్ ప్రశంస
  • పోస్ట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసలు, మౌలిక వసతులపై విజ్ఞప్తులు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి సౌందర్యం, గిరిజన సంస్కృతి, అచంచలమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. అరకు లోయలో సూర్యోదయ వేళ తీసిన గిరిజన మహిళ ఫొటోలను ఆయన 'ఎక్స్'  వేదికగా షేర్ చేశారు. "ఆంధ్రా ఆత్మను ఒకే ఫ్రేమ్‌లో బంధించినట్లుంది" అంటూ ఆయన ఈ చిత్రానికి క్యాప్షన్ జోడించారు.

ప్రముఖ అవార్డు విన్నింగ్ ఫొటోగ్రాఫర్ రాకేశ్ పులప తీసిన ఈ ఫొటో సిరీస్‌లో.. పొగమంచు కమ్మేసిన పచ్చని కొండల నడుమ సూర్యోదయం వేళ, తలపై బిందెతో ఉన్న ఓ గిరిజన మహిళ నీడరూపం (సిల్హౌట్) అద్భుతంగా కనిపిస్తుంది. తాను ఇటీవల తీసిన ఈ చిత్రాలు... అరకులోని చూడని కోణాన్నిఆవిష్కరిస్తాయని ఫొటోగ్రాఫర్ రాకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫొటోకు వేల సంఖ్యలో లైకులు, స్పందనలు వెల్లువెత్తాయి.

తూర్పు కనుమల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకు లోయ జీవవైవిధ్యానికి, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి. కొండదొర, వాల్మీకి వంటి తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. బొర్రా గుహలు, కాఫీ తోటలు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

మంత్రి లోకేశ్ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. "నిజంగా చాలా అందమైన చిత్రాలు" అంటూ కొందరు అభినందించగా, మరికొందరు పెరుగుతున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి సూచనలు చేశారు. "అరకు చూడదగ్గ ప్రదేశం, కానీ రద్దీ ఎక్కువగా ఉంటోంది. అరకుతో పాటు విశాఖలో కూడా ప్రభుత్వం సౌకర్యాలు మెరుగుపరచాలి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

అరకులో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 'అరకు చలి ఉత్సవ్' వంటి కార్యక్రమాలు నిర్వహించి గిరిజన కళలు, సంస్కృతిని ప్రోత్సహించింది. నూతన పర్యాటక విధానంలో భాగంగా అరకును ఎకో-టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ, హోమ్‌స్టేల ఏర్పాటు వంటి పథకాలను అమలు చేస్తోంది. అయితే, పర్యాటకాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించడం అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Nara Lokesh
Araku Valley
Andhra Pradesh Tourism
Rakesh Pulapa
Tribal Culture
Alluri Sitarama Raju district
Borra Caves
Coffee Plantations
Eco Tourism
Visakhapatnam

More Telugu News