Sigachi Industries: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదం: ఆరు నెలల తర్వాత సిగాచి ఎండీ అరెస్ట్

Sigachi Industries MD Amit Raj Sinha Arrested After Sangareddy Fire
  • 54 మంది మృతి కేసులో కీలక పరిణామం
  • సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో సిగాచి ఎండీ అరెస్ట్
  • అమిత్ రాజ్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • దర్యాప్తు జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అరెస్ట్
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో 54 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్న భారీ అగ్నిప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ అరెస్ట్ విషయాన్ని సిగాచి కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు అధికారికంగా తెలియజేసింది. అగ్నిప్రమాద ఘటనపై జరుగుతున్న విచారణలో భాగంగా శనివారం అమిత్ రాజ్ సిన్హాను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని, డిప్యూటీ గ్రూప్ సీఈఓ లిజా స్టీఫెన్ చాకో తాత్కాలికంగా బాధ్యతలు చూస్తారని వెల్లడించింది.

ఈ ఏడాది జూన్ 30న పశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ ప్లాంట్‌లో టాబ్లెట్లు, క్యాప్సూల్స్‌లో ఉపయోగించే మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్‌ను తయారు చేస్తారు.

ఈ ఘటనపై బీడీఎల్-భానూర్ పోలీసులు కంపెనీ యాజమాన్యంపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇన్ని రోజులుగా అరెస్టులు జరగకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ కేసులో దర్యాప్తు జాప్యంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా, విచారణాధికారిని కోర్టుకు పిలిపించి కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు జోక్యం చేసుకున్న కొద్ది రోజులకే ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.

మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించడానికి సిగాచి యాజమాన్యం అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపింది.


Sigachi Industries
Sangareddy fire accident
Amit Raj Sinha
Telangana fire
Sigachi MD arrested
Pasamylaram fire
Microcrystalline cellulose
BDL Bhanur police
Telangana High Court

More Telugu News