Navi Mumbai Mother: మరాఠీ మాట్లాడడం లేదని కన్న బిడ్డను చంపిన తల్లి!

Mother Kills Daughter for Not Speaking Marathi in Navi Mumbai
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలోని నవీ ముంబైలో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠీ భాష సరిగా మాట్లాడటం లేదన్న కారణంతో ఆరేళ్ల కన్న కూతురిని ఓ తల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఈ అమానుష ఘటన కలాంబోలి ప్రాంతంలో చోటుచేసుకుంది. తొలుత చిన్నారి గుండెపోటుతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, కలాంబోలిలోని గురుసంకల్ప్ హౌసింగ్ సొసైటీలో నివసించే దంపతులకు 2019లో పాప జన్మించింది. భర్త ఐటీ ఇంజనీర్ కాగా, భార్య బీఎస్సీ చదివింది. అయితే చిన్నారికి చిన్నప్పటి నుంచి మాటలు సరిగా రాకపోవడంతో పాటు, ఎక్కువగా హిందీ మాట్లాడేది. ఇదే విషయంపై తల్లి తరచూ ఆగ్రహం వ్యక్తం చేసేదని తెలిసింది. "ఇలాంటి కూతురు నాకు వద్దు, సరిగా మాట్లాడటం లేదు" అని భర్తతో చాలాసార్లు గొడవ పడినట్లు విచారణలో వెల్లడైంది.

డిసెంబర్ 23 రాత్రి, చిన్నారిని ఆమె తల్లి హత్య చేసింది. పాప స్పృహలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండెపోటుతో చనిపోయిందని చెప్పారు. అయితే, చిన్నారి మృతిపై అనుమానం వచ్చిన కలాంబోలి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కోటే పోస్టుమార్టంకు ఆదేశించారు. శ్వాస ఆడకపోవడం వల్లే పాప చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో తేలడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో పోలీసులు తల్లిదండ్రులను సుమారు ఆరు గంటల పాటు విచారించగా, తానే కూతురిని గొంతు నులిమి చంపినట్లు తల్లి అంగీకరించింది. నిందితురాలు కొంతకాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి, కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Navi Mumbai Mother
Child Murder
Marathi Language
Kalamboli
Mumbai Crime
Child killed for not speaking Marathi
Infant death
Crime news India
Mental health
Police investigation

More Telugu News