Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి పెరిగిన టికెట్ ధరలు

Indian Railways Ticket Prices Hike Comes Into Effect Today
  • నేటి నుంచి పెరిగిన రైలు ఛార్జీలు
  • సబర్బన్, సీజన్ టికెట్లకు మినహాయింపు
  • కిలోమీటర్‌కు 1 నుంచి 2 పైసల వరకు పెంపు
  • నిర్వహణ ఖర్చుల వల్లే పెంచవలసి వచ్చిందంటున్న ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల తీవ్ర విమర్శలు
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. పెంచిన రైలు ఛార్జీలు నేటి  నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జులైలో ఒకసారి ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ, కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ఏసీ క్లాసులతో పాటు, 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆర్డినరీ నాన్-ఏసీ క్లాసులపై కూడా ఈ పెంపు ప్రభావం చూపనుంది. అయితే, సబర్బన్ (లోకల్) రైళ్లు, సీజన్ టికెట్లకు ఈ పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం సామాన్య ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే అంశం.

పెంపు వెనుక కారణాలివే..

భారీగా పెరిగిన నిర్వహణ ఖర్చులు, ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు (రూ.1,15,000 కోట్లు), పెన్షన్ల బిల్లు (రూ.60,000 కోట్లు) భారాన్ని తగ్గించుకునేందుకే ఈ "ఛార్జీల హేతుబద్ధీకరణ" చేపట్టినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా, రైల్వేల ఆర్థిక సుస్థిరతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఛార్జీలు పెంచినప్పటికీ, ఇప్పటికీ ప్రయాణికుల టికెట్ ధరలో దాదాపు 50 శాతం సబ్సిడీ రూపంలో తామే భరిస్తున్నామని రైల్వే శాఖ పేర్కొంది.

ఎవరిపై ఎంత భారం?

రైల్వే బోర్డు జారీ చేసిన కమర్షియల్ సర్క్యులర్ నం. 24 ప్రకారం, ఛార్జీల పెంపు ఇలా ఉంది:

  • సబర్బన్, సీజన్ టికెట్లు: ఎలాంటి మార్పు లేదు. 
  • ఆర్డినరీ నాన్-ఏసీ: 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి పాత ఛార్జీలే వర్తిస్తాయి. ఆ తర్వాత దూర ప్రయాణాలపై శ్లాబుల వారీగా రూ.5 నుంచి రూ.20 వరకు పెంచారు. 
  • స్లీపర్ క్లాస్ (ఆర్డినరీ): కిలోమీటర్‌కు 1 పైసా పెరిగింది. 
  • మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ క్లాసులు): స్లీపర్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్‌తో పాటు రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి అన్ని ప్రీమియం రైళ్లలో కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి.
డిసెంబర్ 26కు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రభుత్వంపై విపక్షాల తీవ్ర విమర్శలు

రైలు ఛార్జీల పెంపుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, "మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు. బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు, పార్లమెంటులో చర్చ లేకుండా ఛార్జీలు పెంచారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ లేకపోవడంతో జవాబుదారీతనం కనుమరుగైంది" అని విమర్శించారు. రైల్వే భద్రతా వ్యవస్థ 'కవచ్' కేవలం 3% మార్గాలకే పరిమితమైందని, ఇది కేవలం ప్రచారానికే తప్ప ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ ప్రయాణికుల ప్రయాణం "నరకప్రాయంగా" మారిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
Indian Railways
railway ticket prices
train ticket hike
Indian Railways fares
increased train fares
railway charges
train travel India
railway ministry
train fares hike

More Telugu News