వైభవ్​ను భారత జట్టులోకి తీసుకోవాలి.. అత‌ను మ‌రో సచిన్‌: శశి థరూర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్

  • విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ
  • 84 బంతుల్లోనే 190 పరుగులతో చెలరేగిన యువ సంచ‌ల‌నం
  • వైభవ్‌ను సచిన్‌తో పోలుస్తూ భారత జట్టులోకి తీసుకోవాలన్న శశి థరూర్
  • ఐపీఎల్‌లో రాణిస్తే టీమిండియాలోకి రావడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా
భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ యువ కెరటం సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమాని అయిన శశి థరూర్ ఈ కుర్రాడి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌తో వైభవ్‌ను పోలుస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. "గతంలో 14 ఏళ్ల వయసులో ఇంతటి అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పుడు, అది సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మనం ఇంకా దేని కోసం ఎదురుచూస్తున్నాం? వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో విఫలమవడంతో వైభవ్ టెంపర్‌మెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే, వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా బీహార్ జట్టు 574/6 పరుగుల భారీ స్కోరు సాధించి, టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వైభవ్‌పై స్పందించాడు. "వైభవ్ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. రాబోయే ఐపీఎల్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే, అతను భారత జట్టు తలుపు త‌ట్ట‌డం ఖాయం" అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న వైభవ్‌కు రాబోయే ఐపీఎల్ సీజన్ కీలకం కానుంది. పెరిగిన అంచనాల మధ్య అతను ఎలా రాణిస్తాడో చూడాలి.


More Telugu News