రుషికొండ నిర్మాణాలపై మరో రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు: పయ్యావుల కేశవ్
- రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ భేటీ
- హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కోసం వినియోగించే అంశాన్ని పరిశీలించామన్న కేశవ్
- గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కందుల దుర్గేశ్
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మూడవ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వర్చువల్గా చేరారు.
ప్యాలెస్ను హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కోసం వినియోగించాలా? అనే అంశాన్ని పరిశీలించామని పయ్యావుల తెలిపారు. హోటల్ కోసం అదనపు స్థలం కావాలని కొందరు అడిగారని చెప్పారు. రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాలు సీఆర్ జెడ్ నిబంధనల పరిధిలోకి వస్తాయని, అందులో ఎలాంటి నిర్మాణం జరపరాదని స్పష్టంచేశారు.
ఇక ప్యాలెస్ చివరి రెండు బ్లాక్లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, టూరిజం అవసరాలకు ఉంచబడతాయని తెలిపారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి గ్రూపులు ప్రాజెక్టుల కోసం ముందుకు వచ్చాయని పయ్యావుల వెల్లడించారు. రుషికొండ నిర్మాణాలపై మళ్లీ రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
మరో మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ... ఆదాయం వచ్చే భవనాలను కూల్చి ప్యాలెస్ కట్టారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుషికొండ వినియోగానికి సంబంధించిన అనేక ప్రపోజల్స్ వస్తున్నాయని తెలిపారు. రుషికొండ కింద 9 ఎకరాల్లో సముద్రం ఆటుపోట్ల కారణంగా రెండెకరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని చెప్పారు.