Sri Charani: విశాఖలో శ్రీ చరణి, వైష్ణవి స్పిన్ మ్యాజిక్... లంక స్వల్ప స్కోరుకే పరిమితం

Sri Charani and Vaishnavi Spin Magic Restricts Sri Lanka in Visakhapatnam
  • రెండో టీ20లో శ్రీలంకను 128 పరుగులకే కట్టడి చేసిన భారత్
  • చెరో రెండు వికెట్లతో రాణించిన స్పిన్నర్లు శ్రీ చరణి, వైష్ణవి శర్మ
  • లంక జట్టులో సమరవిక్రమ, అటపట్టు మాత్రమే రాణింపు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఎన్. శ్రీ చరణి (2/23), వైష్ణవి శర్మ (2/32) రాణించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే పేసర్ క్రాంతి గౌడ్ (1/21) శుభారంభం అందించింది. ఓపెనర్ విష్మి గుణరత్నె (1)ను తొలి ఓవర్‌లోనే ఔట్ చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (24 బంతుల్లో 31) రెండు సిక్సర్లతో దూకుడుగా ఆడినప్పటికీ, ఆమెను స్నేహ్ రాణా (1/11) పెవిలియన్‌కు పంపింది. జ్వరంతో దీప్తి శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన స్నేహ్ రాణా కీలక వికెట్ పడగొట్టింది.

ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ (33), పెరీరా (22) కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, ఈ జోడీని శ్రీ చరణి విడదీయడంతో లంక పతనం మొదలైంది. ఆ తర్వాత వైష్ణవి శర్మ కూడా వికెట్లు తీయడంతో లంక స్కోరు వేగం మందగించింది. నీలాక్షి డిసిల్వా (2)ను ఔట్ చేసిన వైష్ణవి, తన తొలి టీ20 వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.

చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ జట్టు 128 పరుగులకే పరిమితమైంది. 
Sri Charani
Sri Lanka women's team
India women's team
Visakhapatnam
ACA-VDCA Stadium
womens T20
Vaishnavi Sharma
womens cricket
Sneha Rana
Kranti Gowd

More Telugu News