చైనా, పాకిస్థాన్‌తో వివాదాలు.. యుద్ధాలకు సిద్ధంగా ఉండాలని సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

  • ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయన్న అనిల్ చౌహాన్
  • ఇద్దరు ప్రత్యర్థులు అణుసామర్థ్యం కలిగి ఉన్నారన్న సీడీఎస్
  • ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్య
స్వల్పకాలిక, దీర్ఘకాలిక యుద్ధాలకు భారత్ సంసిద్ధంగా ఉండాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు సామర్థ్యం కలిగిన చైనా, పాకిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐఐటీ బాంబేలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని గుర్తు చేశారు.

భారత్‌కు ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారని, ఆ రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ దేశాల నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే కొనసాగుతున్న సరిహద్దు వివాదాల కారణంగా భూతల ఘర్షణల్లో పోరాడేందుకు సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటిని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ యుద్ధ తీరును మారుస్తున్నాయని అన్నారు.


More Telugu News