వంజంగి మేఘ సౌందర్యం అమేజింగ్: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్

  • వంజంగి ప్రకృతి సౌందర్యంపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్
  • ఓ నెటిజన్ చేసిన పోస్టును తన ఖాతాలో పంచుకున్న లోకేశ్
  • అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వంజంగి
  • శీతాకాలంలో మేఘాల అందాలు వీక్షించేందుకు పర్యాటకుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి ప్రకృతి సౌందర్యంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. వంజంగి అందాలను వర్ణిస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్టును ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. "వంజంగి ఎప్పుడూ అబ్బురపరచడంలో విఫలం కాదు. మాయ చేసే మేఘాల పొరలు, బంగారు కాంతి, మాటల్లో వర్ణించలేని ప్రశాంతత.. ఇది ప్రకృతి అత్యద్భుతమైన రూపం" అని ఆ పోస్టులో ఉన్న వ్యాఖ్యలను లోకేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలో వంజంగి అనే ఈ సుందరమైన కొండ ప్రాంతం ఉంది. ఎత్తయిన ఈ ప్రదేశంలో మబ్బులు చేతికి అందినంత దగ్గరగా ఉండటం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతుంది.

సూర్యోదయ సమయంలో కొండలపై తేలియాడే మబ్బుల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తెల్లవారుజామునే ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటారు. సాధారణంగానే పర్యాటకులను విశేషంగా ఆకర్షించే వంజంగికి, ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ పోస్టుతో మరింత ప్రచారం లభించినట్లయింది.


More Telugu News