Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం!.. స్వాగతించిన బండి సంజయ్

Bandi Sanjay Welcomes SIT Decision to Issue Notices to KCR KTR in Phone Tapping Case
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు
  • సిట్ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్రమంత్రి బండి సంజయ్
  • ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణ
  • టీవీ సీరియల్స్ పూర్తయ్యాయి, కానీ కేసు తేలలేదన్న విమర్శ
  • విచారణ అధికారులకు స్వేచ్ఛనివ్వాలని డిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో పాటు ఎందరో నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. "కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించి, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు" అని మండిపడ్డారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు, నేతల నుంచి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, ఈ విచారణపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా, లేక దోషులను తేలుస్తారా అని ప్రశ్నించారు. "ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పుడు ప్రారంభమైన టీవీ సీరియళ్లు కూడా పూర్తయ్యాయి కానీ, ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది" అని ఎద్దేవా చేశారు. విచారణ అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను బయటపెట్టాలని ఆయన కోరారు.
Bandi Sanjay
KCR
KTR
Telangana Politics
Phone Tapping Case
Telangana SIT
BRS Party
Bandi Sanjay Comments
Telangana News
Cyber Crime

More Telugu News