ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు.. 80 శాతం ఉద్యోగాలు మహిళలకే!
- కర్ణాటక దేవనహళ్లి యూనిట్ లో ఫాక్స్కాన్ నియామకాలు
- 300 ఎకరాల్లో ఉన్న దేవనహళ్లి యూనిట్
- ఉత్పత్తి అయిన ఐఫోన్లలో 80 శాతం విదేశాలకు ఎగుమతి
చైనా నుంచి వ్యవస్థలను భారత్ కు మళ్లించడానికి దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ తన కర్ణాటక యూనిట్లో నియామకాలను వేగవంతం చేసింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి ఫ్యాక్టరీలో కేవలం 8–9 నెలల్లోనే దాదాపు 30 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండటం విశేషం.
300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ గా ఉంది. ఈ యూనిట్లో ప్రారంభంలో ఐఫోన్ 16 మోడల్ ఉత్పత్తి జరుగుతుండగా, ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ కూడా తయారీకి వచ్చాయి. ఉత్పత్తిలోని ఐఫోన్లలో 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఫాక్స్కాన్ ఇప్పటికే మినీ టౌన్షిప్ స్థాయిలో సౌకర్యాలు అందిస్తూ, ఉద్యోగుల కోసం ఇళ్లు, వైద్య, విద్యా సదుపాయాలు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నాటికి సిబ్బందిని 50 వేల వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఫాక్స్కాన్ తమిళనాడు ఐఫోన్ ప్లాంట్ తర్వాత ఇది రెండో పెద్ద ప్రాజెక్ట్. తమిళనాడులోని ఫ్యాక్టరీలో 41 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోనూ అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఫాక్స్కాన్ డిజైన్, టెక్ విభాగాల్లో మహిళలను అగ్రగాములుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నియామకాలు చేస్తున్నట్లు వెల్లడించింది.