రైలు ప్రయాణంలో నవ దంపతుల మృతిలో కొత్త ట్విస్ట్...!

  • యాదాద్రి వద్ద రైలు నుంచి పడి నవ దంపతుల మృతి
  • ప్రమాదం కాదని తేల్చిన ప్రాథమిక దర్యాప్తు
  • మృతికి ముందు రైలులో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం
  • భార్య దూకేయడంతో, భయపడి ఆమె వెనకే దూకేసిన భర్త
  • తోటి ప్రయాణికుడి వీడియోతో వెలుగులోకి వచ్చిన నిజం
యాదాద్రి భువనగిరి జిల్లాలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన కొత్త మలుపు తీసుకుంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే వారి మరణానికి దారితీసిందని తెలుస్తోంది. తోటి ప్రయాణికుడు తీసిన వీడియో ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వీరు, గురువారం రాత్రి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.

ప్రయాణ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవను తోటి ప్రయాణికుడు ఒకరు తన ఫోన్‌లో రికార్డ్ చేశారు. మాటామాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన భవాని, కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసింది. ఇది చూసి భయాందోళనకు గురైన సింహాచలం కూడా ఆమె వెంటే దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

శుక్రవారం ఉదయం వంగపల్లి - ఆలేరు రైలు మార్గంలో ట్రాక్‌మెన్‌ మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, ప్రయాణికుడి వీడియో సాక్ష్యంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రెండు నెలల క్రితమే ఒక్కటైన జంట ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


More Telugu News

Korada Simhachalam Yadadri Bhuvanagiri Machiipatnam Express Newly wed couple death Train accident Bhavanai Andhra Pradesh Railway police investigation Domestic dispute Aleer railway track