YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. మరింత జాప్యం!

YS Jagan Illegal Assets Case Faces Delay After Judge Transfer
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో, దశాబ్దాలుగా సాగుతున్న విచారణ మరింత ఆలస్యం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త న్యాయమూర్తిగా పట్టాభిరామారావును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీ తర్వాత రిలీవ్ కానుండగా, 29వ తేదీలోపు కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తి కేసును మళ్లీ మొదటి నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది విచారణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

గతంలో కూడా పలుమార్లు న్యాయమూర్తులు మారడం వల్ల జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్ల విచారణే ఇంకా పూర్తికాలేదు. ప్రధాన కేసు ట్రయల్ దశకు వెళ్లకుండా ఈ పిటిషన్లు అడ్డంకిగా ఉన్నాయని, వ్యూహాత్మకంగానే కేసులో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కేసును వేగంగా విచారించి తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆచరణలో అవి అమలు కావడం లేదు. తాజా పరిణామంతో విచారణ ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే న్యాయమూర్తి అయినా విచారణను వేగవంతం చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
YS Jagan
Jagan illegal assets case
Nampally CBI court
Raghuram
Pattabhirama Rao
Discharge petitions
Supreme court
High court
Corruption case
Andhra Pradesh politics

More Telugu News