Chandrababu: ఏపీ అభివృద్ధికి చేయూతనివ్వండి.. కేంద్ర మంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు

Chandrababu Seeks Support for AP Development from Nirmala Sitharaman
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు. అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.

‘సాస్కీ’తో ఏపీకి చేయూత
‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASKY) పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని సీఎం కోరారు. పూర్వోదయ పథకం కింద గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు కోరారు.
Go Back to Shorts
Chandrababu
AP Development
Nirmala Sitharaman
Andhra Pradesh Budget
Rayalaseema Horticulture Hub
Polavaram Project
Godavari River
SASKY Scheme
Union Budget 2024
AP Finance

More Telugu News