నష్టాల్లో మార్కెట్లు.. మీషో జోరు.. 7 రోజుల్లో 130 శాతం లాభం

  • వరుసగా మూడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
  • మార్కెట్ పతనంలోనూ దూసుకెళుతున్న మీషో షేరు
  • ఏడు ట్రేడింగ్ రోజుల్లో 130 శాతానికి పైగా లాభాలు
  • ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరిన షేరు
  • లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన కంపెనీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమవుతున్నాయి. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇటీవల లిస్టయిన మీషో లిమిటెడ్ షేరు మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఏకంగా 16 శాతం పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇంట్రాడేలో ఈ షేరు రూ. 254.40 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. డిసెంబర్ 10న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ, కేవలం 7 ట్రేడింగ్ సెషన్లలోనే 130 శాతం రాబడిని అందించి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది.

మీషో ఐపీఓ ఇష్యూ ధర రూ. 111 కాగా, ఎన్ఎస్ఈలో 46 శాతం ప్రీమియంతో రూ. 162.50 వద్ద లిస్ట్ అయింది. అప్పటి నుంచి వరుసగా అప్పర్ సర్క్యూట్లతో దూసుకుపోతోంది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 79 రెట్ల అధికంగా సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.

ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.05 లక్షల కోట్లు దాటింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై పాజిటివ్‌గా స్పందిస్తూ టార్గెట్ ధరను పెంచడంతో, కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 84,400 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 25,800 దిగువన ట్రేడవుతున్నాయి.


More Telugu News

Meesho Meesho IPO Stock Market Share Price NSE BSE Indian Stock Market IPO Subscription Stock Returns Investment