ఉపాధి హామీ చట్టం రద్దు.. కొత్త బిల్లుకు లోక్సభ ఆమోదం
- మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లు
- ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్సభ ఆమోదం
- విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి సభలో విసిరేశారు. విపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమనే స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గినట్లు ప్రకటించారు.
ప్రతిపక్షాల నిరసనలతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో, స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.