విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. ఏపీ ప్రభుత్వంతో ఏడీటీవోఐ ఒప్పందం

  • విశాఖ వేదికగా 'నేషనల్ టూరిజం మార్ట్ 2025' నిర్వహణ
  • ఏడీటీవోఐతో ఏపీ పర్యాటక శాఖ కీలక ఒప్పందం
  • 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఈవెంట్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలోని ప్రముఖ పర్యాటక నిర్వాహకుల సంఘం 'అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI)' సహకారంతో విశాఖపట్నం వేదికగా "ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025"ను నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ను 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు.

సచివాలయంలోని తన కార్యాలయంలో ఏడీటీవోఐ ప్రతినిధులతో మంత్రి దుర్గేశ్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అద్భుతమైన తీరప్రాంతం, మౌలిక వసతులున్న విశాఖ ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్, ఆధ్యాత్మిక, ఎకో-అడ్వెంచర్, ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక అవుతుందని తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ మార్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు, పర్యాటక రంగ నిపుణులు పాల్గొంటారని మంత్రి వివరించారు. బీ2బీ సమావేశాలు, ప్యానెల్ చర్చల ద్వారా స్థానిక పర్యాటక వాటాదారులకు జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి పర్యాటకుల రాక పెరగడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు.

దేశీయ పర్యాటకాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఏడీటీవోఐ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఏడీటీవోఐ ప్రెసిడెంట్ వేద్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News

Kandula Durgesh Andhra Pradesh Tourism ADTOI National Tourism Mart 2025 Visakhapatnam Tourism Development AP Tourism Ved Khanna Coastal Tourism Eco Adventure Tourism Domestic Tourism