BRS Party: ఎమ్మెల్యేల అనర్హత అంశం... స్పీకర్ తీర్పుపై కోర్టుకు వెళ్లనున్న బీఆర్ఎస్

BRS to Challenge Speakers Decision on MLA Disqualification in Court
షార్ట్స్‌లో చూడండి
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ, దీన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కె. సంజయ్, కె.పి. వివేకానంద్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే స్పీకర్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని వారు ఆరోపించారు. ఒక ట్రైబ్యునల్ హెడ్‌గా స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి అనుగుణంగానే ఈ తీర్పు వెలువడిందని వారు దుయ్యబట్టారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఆ పది స్థానాలకు కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని సంజయ్ జోస్యం చెప్పారు.

స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పందిస్తూ.. "రాజ్యాంగాన్ని కాపాడండి" అనే రాహుల్ గాంధీ నినాదం ఈ తీర్పుతో బట్టబయలైందని ఎద్దేవా చేశారు. ఇది రాజ్యాంగాన్ని కాపాడటం కాదని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాన్ని రాజకీయంగా వాడుకోవడమేనని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు లేవన్న స్పీకర్ వాదనను బీఆర్ఎస్ పార్టీ తప్పుబట్టింది. సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫోటోలను తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

తెల్లం వెంకట్ రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని, సాంకేతికంగా వారు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని స్పీకర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తీర్పు గురువారం వెలువడే అవకాశం ఉండగా, మిగతా ఇద్దరిపై వారి వివరణ అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.
Go Back to Shorts
BRS Party
Telangana Politics
MLA Disqualification
Gaddam Prasad Kumar
Revanth Reddy
Harish Rao
Telangana Congress
Telangana Assembly
Party Defection
Telangana News

More Telugu News