Thailand Cambodia border dispute: థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం.. తీవ్రమవుతున్న ఘర్షణలు.. థాయ్‌లాండ్ కీలక డిమాండ్

Cambodia Thailand Border Clashes Escalate Thailand Issues Key Demand
షార్ట్స్‌లో చూడండి
ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్న వేళ, థాయ్‌లాండ్ ఓ కీలక షరతు విధించింది. తమ భూభాగంపై దాడికి పాల్పడింది కంబోడియానే కాబట్టి, కాల్పుల విరమణను కూడా ఆ దేశమే ముందుగా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి మరాటీ నలితా అండమో మంగళవారం బ్యాంకాక్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

"థాయ్‌లాండ్ భూభాగంపై కంబోడియా దురాక్రమణకు పాల్పడింది. కాబట్టి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని వారే ముందుగా ప్రకటించాలి" అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతాల్లోని ల్యాండ్‌మైన్‌లను తొలగించేందుకు కంబోడియా చిత్తశుద్ధితో సహకరించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే, థాయ్‌లాండ్ చేసిన ఈ ప్రకటనపై కంబోడియా నుంచి తక్షణమే ఎలాంటి స్పందన రాలేదు.

ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దుపై చాలాకాలంగా వివాదాలున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 7న జరిగిన ఓ ఘర్షణతో మరోసారి దాడులు మొదలయ్యాయి. ఈ తాజా ఘర్షణల్లో ఇరువైపులా సైనికులు, పౌరులతో కలిపి ఇప్పటివరకు 32 మంది మరణించారు. సుమారు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో జులైలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. గత శనివారం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. సరిహద్దుల్లో ఇంకా పోరు కొనసాగుతూనే ఉంది.
Go Back to Shorts
Thailand Cambodia border dispute
Thailand
Cambodia
border conflict
ceasefire agreement
landmines
foreign affairs
Southeast Asia
military conflict
Donald Trump

More Telugu News