Chandrababu Naidu: ఆమె గట్టిగా స్పందించడంతో వెనక్కి తగ్గారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Criticizes YS Jagan Over Court Appearances
  • ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు ఇష్టాగోష్టి
  • న్యాయస్థానాల పట్ల జగన్‌కు గౌరవం లేదని విమర్శలు
  • పీపీపీ విధానంపై కేంద్రమంత్రిని వైసీపీ ఎంపీలు తప్పుదోవ పట్టించారని ఆరోపణ
  • రెండు రోజుల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
  • పార్టీలో మహిళల ప్రాతినిధ్యాన్ని 30 శాతానికి పెంచుతామని వెల్లడి
  • పనిచేయని కమిటీలపై ప్రతి మూడు నెలలకు సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కు న్యాయస్థానాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవడమే దీనికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. మంగళవారం నాడు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన చంద్రబాబు, పలు రాజకీయ, పార్టీ అంశాలపై స్పందించారు.

తిరుమల పరకామణి చోరీ కేసును సాధారణ దొంగతనంగా చూడటాన్ని హైకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేశారు. ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన తీవ్రమైన విషయమన్నారు. అలాగే, పీపీపీ విధానంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, అయితే ఆమె గట్టిగా స్పందించడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు. పీపీపీ విధానం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైందని, దీనివల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు వివరించారు.

ఇదే సమయంలో పార్టీ సంస్థాగత అంశాలపైనా చంద్రబాబు దృష్టి సారించారు. టీడీపీ జిల్లా కమిటీల అధ్యక్ష పదవుల నియామకంపై త్రిసభ్య కమిటీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉన్నందున, పార్టీలో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతమున్న 28.4 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రెండు రోజుల్లో జిల్లా అధ్యక్షుల జాబితాను ప్రకటిస్తామని, నెలాఖరులోగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి కమిటీల పనితీరును సమీక్షిస్తానని, పనిచేయని వారిని నిర్మొహమాటంగా తొలగిస్తానని హెచ్చరించారు. జనవరి నుంచి నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో పార్టీ క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
YS Jagan
Andhra Pradesh Politics
TDP
YSRCP
Nirmala Sitharaman
Tirumala
PPP Model
Women Reservation
Amaravati

More Telugu News