GHMC: విలీనం తర్వాత.... దేశంలోనే అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ

GHMC Becomes Largest Municipal Corporation After Merger
షార్ట్స్‌లో చూడండి
నగర శివారులోని 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది. జీహెచ్ఎంసీ సరిహద్దులు ప్రస్తుతం ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,050 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తాయి. జనాభా 1.12 కోట్ల నుంచి 1.34 కోట్లకు పెరిగే అవకాశముంది. మున్సిపల్ వార్డుల సంఖ్య రెట్టింపై 300కు చేరుకుంటుంది.

పంచాయతీలు, మున్సిపాలిటీలు, చిన్న కార్పొరేషన్లు సహా 27 మున్సిపాలిటీలు విలీనం కావడం వలన జీహెచ్ఎంసీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా మారుతుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం జీహెచ్ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తెలిపారు.

వార్డుల పునర్విభజన కోసం గత వారం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై చర్చించడానికి ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలను, అభ్యంతరాలను లేవనెత్తారు.

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం ఆధారంగా వార్డుల డీలిమిటేషన్‌ను నోటిఫై చేసినట్లు కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలను, అభ్యంతరాలను కోరిందని తెలిపారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. ఇప్పటివరకు 3,000కి పైగా అభ్యంతరాలు వచ్చాయని, అభ్యంతరాలను సమర్పించడానికి డిసెంబర్ 17 చివరి తేదీ అని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ విస్తరణ గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త శకాన్ని సూచిస్తుందని, మరిన్ని ప్రాంతాలను ఏకీకృత పాలనలోకి తీసుకువస్తుందని, సమాన అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందుతాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ సూచనలు, అభ్యంతరాలను ఇస్తే, వాటిని పరిశీలిస్తామని ఆమె అన్నారు.

పార్టీలకు అతీతంగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాలను లేవనెత్తారు. రాజకీయ పార్టీలు, కార్పొరేటర్లను సంప్రదించకుండానే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, జీహెచ్ఎంసీ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు.

అభ్యంతరాలను సమర్పించడానికి గడువును పొడిగించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. మజ్లిస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు డీలిమిటేషన్ జరుగుతోందని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఆరోపించారు. డీలిమిటేషన్ కోసం అనుసరించిన ప్రమాణాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆయన కమిషనర్‌ను డిమాండ్ చేశారు.
Go Back to Shorts
GHMC
Greater Hyderabad Municipal Corporation
Hyderabad
RV Karnan

More Telugu News