ముంబైలో ఇద్దరు టెర్రరిస్టులను అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

  • గ్యాంగ్‌స్టర్ నుంచి ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు అరెస్టు
  • సాజన్ మాసిహ్, సుఖ్‌దేవ్ కుమార్‌గా గుర్తింపు
  • నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు డీజీపీ వెల్లడి
ముంబైలో గ్యాంగ్‌స్టర్ నుంచి ఉగ్రవాదులుగా మారిన ఇద్దరిని... పంజాబ్ పోలీసులు, కేంద్ర సంస్థల సమన్వయంతో అరెస్టు చేశారు. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)తో సంబంధాలున్నట్లు గుర్తించామని, వారిని అరెస్టు చేశామని డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.

అరెస్టు చేసిన వారిని గురుదాస్‌పూర్‌లోని వెరోక్ నివాసి సాజన్ మాసిహ్, అమృత్‌సర్‌లోని లాహోరి గేట్ నివాసి సుఖ్‌దేవ్ కుమార్ అలియాస్ మునీష్ బేడీగా గుర్తించారు.

నిందితులిద్దరికీ నేర చరిత్ర ఉందని డీజీపీ తెలిపారు. వీరిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా సంబంధిత కేసులు బటాలా, అమృత్‌సర్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైనట్లు వెల్లడించారు. నిందితులిద్దరికీ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. నిందితులు దుబాయ్, అర్మేనియాతో సహా విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్‌లోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు సిద్ధమైనట్లు వెల్లడించారు. వారి అరెస్టు రాష్ట్ర పోలీసుల అతిపెద్ద విజయమని అభివర్ణించారు.


More Telugu News