ఎల్లారెడ్డిలో సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటన.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్

  • ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో ఘటన
  • బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్టు ఆరోపణలు
  • ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కేటీఆర్
ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆయన కోరారు. సంబంధిత ఎస్పీకి ఫోన్ చేసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు తిరగబడితే శాంతిభద్రతలు అదుపులో ఉండవని ఆయన హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజుని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పాపయ్య ట్రాక్టరుతో ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి, ఈ ఘటనలో గాయపడిన నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.


More Telugu News