ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక మలుపు.. జెలెన్‌స్కీ కొత్త ప్రతిపాదన

  • నాటో సభ్యత్వ ఆశలు వదులుకునేందుకు జెలెన్‌స్కీ సుముఖత
  • పశ్చిమ దేశాల నుంచి భద్రతా హామీలు కోరుతున్న ఉక్రెయిన్
  • దేశ భూభాగాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకు నిరాకరణ
  • ట్రంప్ ప్రతినిధులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక చర్చలు
రష్యాతో యుద్ధాన్ని ముగించే దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు తమకు స్పష్టమైన భద్రతా హామీలు ఇస్తే, నాటో కూటమిలో చేరాలన్న తమ ప్రయత్నాలను విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే, రష్యాకు భూభాగాన్ని అప్పగించాలన్న అమెరికా ఒత్తిడిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో జరిపిన చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, కొన్ని ఐరోపా దేశాలు నాటో సభ్యత్వానికి అంగీకరించనందున, కనీసం ఆ కూటమి సభ్యులకు లభించే తరహాలో తమకు భద్రతా హామీలు ఆశిస్తున్నామని జెలెన్‌స్కీ తెలిపారు. భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయకుండా ఈ హామీలు నిరోధిస్తాయని, ఇది తమ వైపు నుంచి ఒక రాజీ సూత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ హామీలకు అమెరికా కాంగ్రెస్ చట్టబద్ధమైన మద్దతు ఉండాలని ఆయన తెలిపారు.

చర్చల సందర్భంగా తూర్పు దొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వైదొలగి, అక్కడ సైనిక రహిత స్వేచ్ఛా వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాద‌‌న‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. "ఆ ప్రాంతాన్ని ఎవరు నిర్వహిస్తారు? మేం వెనక్కి తగ్గితే, రష్యా దళాలు కూడా ఆక్రమిత ప్రాంతాల నుంచి అంతే దూరం వెనక్కి వెళ్లాలి కదా?" అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఎవరి బలగాలు ఎక్కడున్నాయో అక్కడే యథాతథ స్థితిని కొనసాగించడమే సరైన పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు నాటోలో చేరాలన్న ఆలోచనను ఉక్రెయిన్ పూర్తిగా విరమించుకోవాలని రష్యా మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. శాంతి ఒప్పందంలో భాగంగా దొనెట్స్క్‌ను వదులుకునే ప్రసక్తే లేదని రష్యా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్చల నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగిస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, భూభాగాల నియంత్రణ అంశం శాంతి ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారింది.


More Telugu News