GV Reddy: న్యాయవాద వృత్తి చేపట్టిన జీవీ రెడ్డి.. స్వయంగా వెళ్లి అభినందించిన వెంకయ్య

Venkaiah Naidu Praises GV Reddy on Law Career
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ మాజీ నేత జీవీ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి తీరని లోటు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకుని న్యాయవాద వృత్తిని ప్రారంభించిన జీవీ రెడ్డిని, ఆయన కార్యాలయంలో వెంకయ్య నాయుడు శనివారం స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జీవీ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి తాను జీవీ రెడ్డిని గమనిస్తున్నానని, ఆయన చాలా సంస్కారవంతంగా, అర్థవంతంగా విషయాలను వివరించేవారని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. విమర్శలకు సంయమనం కోల్పోకుండా, గట్టిగా సమాధానం చెప్పే నేర్పు ఆయన సొంతమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొన్నాళ్లు పనిచేసిన జీవీ రెడ్డి, తాను నమ్మిన కొన్ని సిద్ధాంతాల విషయంలో ప్రభుత్వంతో విభేదించి పదవికి రాజీనామా చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోవడం పార్టీకే నష్టం తప్ప ఆయనకు కాదని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తాను క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ, రాజకీయాలను నిశితంగా గమనిస్తుంటానని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా, కేవలం విషయాల ప్రాతిపదికనే విమర్శలు ఉండాలన్నది తన అభిప్రాయమని, జీవీ రెడ్డిలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. అందుకే ఆయన్ను అభినందించేందుకు తానే స్వయంగా వచ్చానని చెప్పారు. న్యాయవాద వృత్తిలో జీవీ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదగాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
Go Back to Shorts
GV Reddy
Venkaiah Naidu
TDP
Telugu Desam Party
politics
Andhra Pradesh
advocate
lawyer
political analysis
political commentary

More Telugu News