టీవీ కొనాలనుకుంటున్నారా?.. ఇప్పుడే కొనుక్కోండి.. జనవరి నుంచి బాదుడే!

  • కొత్త ఏడాది నుంచి ప్రియం కానున్న టీవీలు
  • మెమరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం ప్రధాన కారణం
  • జనవరి నుంచి 3 నుంచి 4 శాతం మేర పెంపు అంచనా
  • ఏఐ సర్వర్ల కోసం పెరిగిన చిప్‌ల డిమాండ్‌తో కొరత
  • 10 శాతం వరకు పెంపు తప్పదంటున్న తయారీదారులు
కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో చిప్ తయారీ కంపెనీలు అధిక లాభాలు వచ్చే ఏఐ చిప్‌ల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా టీవీల వంటి పరికరాలకు అవసరమైన చిప్‌ల సరఫరా తగ్గి, వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారి 90 దాటడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఓపెన్‌సెల్, మదర్‌బోర్డు వంటి విడిభాగాల వ్యయం కూడా పెరిగింది.

ఈ పరిణామాలతో ఎల్‌ఈడీ టీవీల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీశ్ తెలిపారు. అయితే, థామ్సన్, కొడక్ వంటి బ్రాండ్లకు టీవీలు తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా మాత్రం ధరల పెంపు 7 నుంచి 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశారు. గత మూడేళ్లలో మెమరీ చిప్‌ల ధర ఏకంగా 500 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు.

మరోవైపు ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 ధరలు సోర్సింగ్ స్థాయిలో 1000 శాతం పెరిగాయని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ అన్నారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు ఈ కొరత కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త ధరల ప్రభావం వినియోగదారులపై పడుతుందని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News