పాక్తో 'నో షేక్ హ్యాండ్'... సీనియర్ల బాటలోనే జూనియర్ టీమిండియా!
- అండర్-19 ఆసియా కప్లో పాకిస్థాన్తో 'నో షేక్ హ్యాండ్' విధానాన్ని పాటించిన భారత్
- టాస్ సమయంలో కనీసం కరచాలనం చేసుకోని ఇరుజట్ల కెప్టెన్లు
- ఇటీవల సీనియర్ పురుషుల, మహిళల జట్లు ప్రారంభించిన విధానాన్నే అనుసరణ
- దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో... ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025లో టీమిండియా సీనియర్ పురుషుల జట్టు ఈ 'నో షేక్ హ్యాండ్' విధానాన్ని ప్రారంభించింది. టోర్నీలో పాకిస్థాన్తో ఆడిన మూడు మ్యాచ్లలోనూ భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. అంతేకాకుండా, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు కూడా నిరాకరించారు. ఆ తర్వాత మహిళల వన్డే ప్రపంచకప్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. ఇప్పుడు జూనియర్ జట్టు కూడా అదే బాటలో నడిచింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, వర్షం కారణంగా దీన్ని 49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్, 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
కాగా, ఈ టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్లో యూఏఈపై భారత్ 234 పరుగుల భారీ తేడాతో గెలిచి రికార్డు స్కోరు (433/6) నమోదు చేయగా, మలేషియాపై పాకిస్థాన్ 297 పరుగుల తేడాతో విజయం సాధించింది.