కోల్‌కతాలో మెస్సీ తీవ్ర అసహనం.. సెల్ఫీల కోసం ఎగబడటంతో చిరాకు!

  • కోల్‌కతాలో మెస్సీకి చేదు అనుభవం
  • సెల్ఫీల కోసం వేదికపైకి ఎగబడిన రాజకీయ నేతలు
  • నిర్వాహకుల తీరుతో తీవ్ర అసహనానికి గురైన ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో తీవ్ర అసహనానికి గురయ్యాడు. నిర్వాహకుల అత్యుత్సాహం, గందరగోళం కారణంగా ఆయన సహనం కోల్పోయాడు. దీంతో వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.

శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మెస్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన మైదానంలోకి అడుగుపెట్టగానే, రాజకీయ నాయకులు, ప్రముఖులు, భద్రతా సిబ్బందితో సహా వందలాది మంది ఫొటోలు, సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ ఘటనపై ఆ మ్యాచ్‌లో ఆడిన భారత మాజీ మిడ్‌ఫీల్డర్ లల్కమల్ భౌమిక్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. "ప్రారంభంలో మెస్సి చాలా ప్రశాంతంగా, నవ్వుతూ అందరితో కరచాలనం చేశారు. అడిగిన వెంటనే ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చారు. కానీ, ఒక్కసారిగా జనం వేదికపైకి దూసుకురావడంతో ఆయన ముఖంలో అసౌకర్యం స్పష్టంగా కనిపించింది" అని వివరించారు.

"పరిస్థితి అదుపు తప్పుతుండటంతో మెస్సి సహనం కోల్పోయారు. ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఫొటోలు తీయడం మొదలుపెట్టడంతో ఆయనలో చిరాకు మొదలైంది. దీంతో మొత్తం కార్యక్రమమే అదుపుతప్పింది" అని భౌమిక్ తెలిపారు. మెస్సీతో పాటు వచ్చిన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఈ గందరగోళంపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో మెస్సీ కేవలం 20-25 నిమిషాల్లోనే మైదానం వీడారు. తమ అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు ఆగ్రహంతో హింసకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.


More Telugu News