ఏపీలో బంగారు గనులు.. జొన్నగిరిలో మొదలైన తవ్వకాలు

  • కర్నూలు జిల్లా జొన్నగిరిలో మొదలైన బంగారు గనుల తవ్వకాలు
  • జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో పసిడి వెలికితీత పనులు
  • టన్ను మట్టి నుంచి 2 గ్రాముల వరకు బంగారం ఉత్పత్తి అంచనా
  • పదేళ్లలో 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను 'జియో మైసూర్' అనే సంస్థ చేపట్టింది.

జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కొన్నేళ్ల క్రితమే నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు జియో మైసూర్ కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి.

అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో ఒక టన్ను మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సుమారు రూ. 5 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. మరోవైపు, వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి 700 గ్రాముల బంగారాన్ని వెలికితీయడం సాధ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా రానున్న పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో దాదాపు కోటి టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు బ్లాక్‌లో భూమికి 180 మీటర్ల లోతున 6.8 టన్నుల పసిడి ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం అధునాతన యంత్రాలను వినియోగిస్తూ, రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు.


More Telugu News