ఒమన్ గల్ఫ్‌లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేసిన ఇరాన్.. సిబ్బందిలో భారతీయులు

  • ఇరాన్ సీజ్ చేసిన ట్యాంకర్‌లో 18 మంది సిబ్బంది
  • 60 లక్షల లీటర్ల అక్రమ చమురు రవాణా చేస్తున్నట్లు ఆరోపణ
  • రెండు రోజుల క్రితం ఇరాన్ నౌకను అడ్డుకున్న అమెరికా
ఒమన్ గల్ఫ్‌లో భారీ పరిమాణంలో చమురును తరలిస్తున్న ఒక నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకలోని 18 మంది సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. భారతీయులతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక దేశస్థులు కూడా సిబ్బందిలో ఉన్నట్లు సమాచారం.

ఈ నౌకలో సుమారు 60 లక్షల లీటర్ల చమురును అక్రమంగా తరలిస్తున్నారని, అందుకే దానిని అదుపులోకి తీసుకున్నామని ఇరాన్ మీడియా తెలిపింది. భద్రతా బలగాలు సమీపిస్తున్న సమయంలో నౌకలోని నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసినట్లు పేర్కొంది. ఇరాన్‌లో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉండటంతో, కొందరు అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చమురును తరలించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇరాన్ నిరంతరం గస్తీ నిర్వహిస్తోంది.

కాగా, రెండు రోజుల క్రితం వెనెజువెలా తీరంలో ఇరాన్‌కు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా సీజ్ చేసింది. ఇరాన్, వెనెజువెలా నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో ఆ నౌకను అడ్డుకుంది. ఈ పరిణామం జరిగిన వెంటనే ఇరాన్ కూడా ఓ నౌకను సీజ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


More Telugu News