హైదరాబాద్‌లో దారుణం.. పదేళ్ల బాలుడిని రోడ్డుకేసి కొట్టి చంపిన సవతి తండ్రి

  • పొరుగింటి పిల్లలతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఘాతుకం
  • బాలుడి తలను రోడ్డుకేసి కొట్టడంతో తీవ్ర గాయాలు
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో పదేళ్ల బాలుడిని సవతి తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని, అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె మొదటి భర్త కుమారుడైన షేక్ మహ్మద్ అజహర్ (10) కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే, అజహర్ తరచూ ఇరుగుపొరుగు పిల్లలతో గొడవ పడేవాడు. ఈ విషయమై స్థానికులు బాలుడి సవతి తండ్రిని నిలదీసేవారు.

ఈ క్రమంలోనే ఈ నెల 7న తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాలుడి తలను పట్టుకుని రోడ్డుకేసి బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన అజహర్‌ను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన సవతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు


More Telugu News