Malayalam Actress: దక్షిణాది నటిపై లైంగిక దాడి కేసులో ఆరుగురికి జైలుశిక్ష

Malayalam Actress Sexual Assault Case 6 Sentenced to Jail
  • నటిపై లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం కోర్టు సంచలన తీర్పు
  • ఆరుగురు దోషులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
  • బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం
  • ఈ కేసులో నటుడు దిలీప్‌తో పాటు మరో ముగ్గురికి ఊరట
  • ఈ శిక్ష తక్కువన్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • హైకోర్టులో అప్పీల్ చేస్తామని వెల్లడి
మలయాళ ప్రముఖ నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం, వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి నిర్భయ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం గమనార్హం.
 
2017 ఫిబ్రవరి 17న కొచ్చిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ గుర్తింపు పొందిన సదరు నటిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి పరారయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
 
ఈ కేసులో పోలీసులు ప్రముఖ నటుడు దిలీప్‌తో సహా మొత్తం 10 మందిపై కిడ్నాప్, గ్యాంగ్ రేప్, కుట్ర, ఆధారాల ధ్వంసం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల కోర్టు దిలీప్‌తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన ఆరుగురిపై అత్యాచారం, కుట్ర వంటి నేరాలు రుజువు కావడంతో వారిని దోషులుగా నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది.
 
అయితే, ఈ తీర్పుపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులకు పడిన శిక్ష తక్కువేనని, దీనిపై త్వరలోనే కేరళ హైకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.
Malayalam Actress
Malayalam actress assault case
sexual assault case
Ernakulam Sessions Court
Kerala High Court
Nirbhaya case
actress kidnapping
molestation case verdict

More Telugu News