వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్

  • సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం
  • వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి
  • వారం రోజుల్లో సంబంధిత పోస్టులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు
  • ఇదే విషయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో, ఈ-కామర్స్‌ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫున ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. అభ్యంతరకర లింక్ లను కోర్టుకు సమర్పించాలని పవన్ కల్యాణ్ న్యాయవాదిని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇచ్చింది. పిటిషనర్ కు అభ్యంతరకరమైన లింక్ లను ఏడు రోజుల్లోగా తొలగించాలని సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్
గతంలో ఈ అంశంపైనే పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్, శిల్పాశెట్టి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ కపూర్‌ లతో పాటు ఆర్ట్‌ ఆఫ్ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ తదితరులు ఉన్నారు.


More Telugu News