తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు... జగిత్యాలలో తల్లిపై కూతురు విజయం
- తొలి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు
- 776 మంది కాంగ్రెస్, 312 మంది బీఆర్ఎస్, 63 మంది బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు
- కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లి గంగవ్వపై కూతురు సుమలత 91 ఓట్లతో విజయం
రిజర్వేషన్లో బీసీ మహిళకు కేటాయించడంతో శివరాత్రి గంగవ్వను బీఆర్ఎస్ బలపరచగా, ఆమె కుమార్తె సుమలతను కాంగ్రెస్ బలపరిచింది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో తల్లి గంగవ్వపై కుమార్తె సుమలత 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మొదటి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా, ఏకగ్రీవాలతో కలుపుకుని 776 మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 312 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 63 మంది, ఇతరులు బలపరిచిన 164 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
మొదటి విడతలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డులకు 65,455 మంది పోటీ పడ్డారు. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ అభ్యర్థులకు ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ తీయడంతో డ్రాలో బీఆర్ఎస్ మద్దతుదారు ఇండ్ల రాజయ్య విజయం సాధించారు.