ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్

  • ఆధార్ అప్‌డేట్స్ కోసం యూఐడీఏఐ కొత్త యాప్ విడుదల
  • ఫేస్ అథెంటికేషన్‌తో వివరాలు మార్చుకునే సౌకర్యం
  • ప్రస్తుతం మొబైల్ నంబర్ అప్‌డేట్ సేవలు లైవ్
  • ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే సవరణ
ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ కొత్త యాప్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ లైవ్ చేసింది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత రూ. 75 ఫీజు చెల్లించి కొత్త మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు 30 రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్‌తో లింక్ అవుతుంది.

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు సేవల వరకు ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. అందుకే అందులోని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు కచ్చితంగా ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రజల సౌలభ్యం కోసం యూఐడీఏఐ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. మొబైల్ నంబర్‌తో పాటు పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ వంటి ఇతర వివరాలను మార్చుకునే సదుపాయాలు కూడా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తెస్తామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంతో ఆధార్ కేంద్రాలపై భారం తగ్గి, ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయి.


More Telugu News