గిల్, పాండ్యా రీఎంట్రీ... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా సంసిద్ధం

  • జట్టులోకి పునరాగమనం చేసిన శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
  • టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో సిరీస్
  • రేపు కటక్ లో తొలి టీ20 మ్యాచ్
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై నెలకొన్న ఆందోళన
  • వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య పోటీ
వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తమ సన్నాహాలను పక్కాగా మొదలుపెట్టేందుకు ప్రపంచ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. రేపు కటక్ లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా మరింత పటిష్ఠంగా మారింది. ఈ సిరీస్ ద్వారా వరల్డ్ కప్ జట్టు కూర్పుపై ఓ స్పష్టతకు రావాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

గాయం కారణంగా దాదాపు నెల రోజులు ఆటకు దూరమైన గిల్, ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం జట్టుకు ఎంతో శుభదాయకం. గిల్ రాకతో యువ సంచలనం అభిషేక్ శర్మతో కలిసి మరోసారి పటిష్ఠమైన ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగనుంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు దేశవాళీ టి20 టోర్నీలో అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హార్దిక్ రాకతో బ్యాటింగ్ డెప్త్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ సమతుల్యం ఏర్పడుతుంది.

అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. గత 20 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయిన సూర్య, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో అతను తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు అత్యవసరం. మరోవైపు, వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఇక దక్షిణాఫ్రికా జట్టులోకి స్టార్ పేసర్ అన్రిచ్ నోర్కియా తిరిగి వచ్చాడు. గాయాల కారణంగా ఆ జట్టు కీలక ఆటగాళ్లు టోనీ డి జోర్జి, క్వెనా మఫాకా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరిలో ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, దానికి ముందు భారత్ దక్షిణాఫ్రికాతో 5, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది.


More Telugu News