భజరంగ్ దళ్ శౌర్య యాత్రపై రాళ్ల వర్షం.. హరిద్వార్‌లో హై టెన్షన్

  • జ్వాలాపూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
  • కొందరు కార్యకర్తలు బుల్డోజర్‌తో ఘటనాస్థలానికి చేరుకోవడం కలకలం
  • వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
  • పోలీసుల హామీతో ఆందోళన విరమించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భజరంగ్ దళ్ నిర్వహించిన 'శౌర్య యాత్ర'పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో జ్వాలాపూర్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

భజరంగ్ దళ్ ఆదివారం సాయంత్రం హరిద్వార్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి 'శౌర్య యాత్ర'ను ప్రారంభించింది. ఈ యాత్ర జ్వాలాపూర్‌లోని రామ్ చౌక్ వద్దకు చేరుకోగానే కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇంతలో కొందరు కార్యకర్తలు బుల్డోజర్‌తో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఈ దాడిపై భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అనుజ్ వాలియా మాట్లాడుతూ "హరిద్వార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మతపరమైన యాత్రలపై దాడులు జరగడం పరిపాలనా వైఫల్యాన్ని తెలియజేస్తోంది" అని విమర్శించారు.

హరిద్వార్ సిటీ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ ఈ ఘటనపై స్పందించారు. సంఘవిద్రోహ శక్తులు యాత్రపై రాళ్లు రువ్వినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేస్తున్నామని, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించడంతో రహదారిపై రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.


More Telugu News