విశాఖలో టీమిండియా గ్రాండ్ విక్టరీపై మంత్రి నారా లోకేశ్ స్పందన

  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్
  • అజేయ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్
  • విశాఖ వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం
  • రోహిత్, కోహ్లీ కూడా అర్ధ సెంచరీలతో రాణింపు
  • టీమిండియా విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం
విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన ఘన విజయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో ఇదొక అద్భుతమైన క్రికెట్ నైట్ అని ట్వీట్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారని, యశస్వి జైస్వాల్ అజేయంగా 116 పరుగులు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఇంతకంటే ఎక్కువ కోరుకోలేరని పేర్కొన్నారు.

విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (75) శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) అజేయ శతకంతో కదం తొక్కాడు. విరాట్ కోహ్లీ (65 నాటౌట్) కూడా రాణించడంతో భారత్ సునాయాసంగా గెలిచింది.


More Telugu News