పుతిన్ విందులో ఖరీదైన 'గుచ్చి' పుట్టగొడుగులు... కేజీ రూ.40 వేలు... ఎందుకంత స్పెషల్?
- రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు
- పూర్తి శాఖాహార మెనూలో ప్రత్యేక ఆకర్షణగా గుచ్చి పుట్టగొడుగులు
- వాణిజ్యపరంగా వీటిని సాగు చేయడం దాదాపు అసాధ్యం
గుచ్చి పుట్టగొడుగులు చాలా అరుదైనవి. ఇవి కేవలం జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని వాణిజ్యపరంగా సాగు చేయడం దాదాపు అసాధ్యం. మంచు కరిగిన తర్వాత వసంతకాలంలో, ప్రత్యేకమైన నేల, ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మాత్రమే ఇవి సహజంగా పెరుగుతాయి. ఒక్కోసారి అడవుల్లో కార్చిచ్చుల తర్వాత కూడా ఇవి మొలకెత్తుతాయి.
ఈ పుట్టగొడుగులను సేకరించడం కూడా చాలా కష్టమైన పని. స్థానికులు కొండ ప్రాంతాల్లోని కఠినమైన భూభాగంలో వారాలపాటు గాలించి, ఎంతో శ్రమించి వీటిని సేకరిస్తారు. కేవలం కొద్ది వారాలు మాత్రమే లభించడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటికి అంత ధర పలుకుతుంది. ఒక్కోసారి లభ్యతను బట్టి కేజీ ధర రూ. 50,000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
గుచ్చి పుట్టగొడుగులు వాటి ప్రత్యేకమైన ఉమామి రుచి, మాంసాన్ని పోలిన ఆకృతికి ప్రసిద్ధి. అందుకే శాఖాహార వంటకాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. వీటితో గుచ్చి పులావ్, యఖ్ని, రోగన్జోష్ వంటి సాంప్రదాయ కశ్మీరీ వంటకాలను కూడా తయారు చేస్తారు. పుతిన్కు ఇచ్చిన శాఖాహార విందులో ఈ అరుదైన, రుచికరమైన వంటకాన్ని చేర్చడం ద్వారా భారతీయ వంటకాల వైవిధ్యాన్ని చాటిచెప్పారు.