భారత్‌కు త్వరలో 40 వేల ఇజ్రాయెల్ లైట్ మిషన్ గన్స్

  • ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ వెల్లడి
  • 1,70,000 కార్బైన్‌లకు సంబంధించిన ఒప్పందం ఖరారు చివరి దశలో ఉందని వెల్లడి
  • ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు వెల్లడి
ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశానికి 40,000 లైట్ మెషిన్ గన్స్ (ఎల్‌ఎంజీ) మొదటి బ్యాచ్‌ను సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దాదాపు 1,70,000 న్యూ-ఏజ్ కార్బైన్‌లను సరఫరా చేయడానికి ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అంశం చివరి దశలో ఉందని తెలిపింది.

పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్స్ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు భారత హోంశాఖలోని వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐడబ్ల్యూఐ సీఈవో షూకి స్కాట్జ్ పేర్కొన్నారు.

గత ఏడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం 40 వేల లైట్ మెషిన్ గన్స్‌ను తొలుత అందించే ప్రయత్నాలు చేస్తున్నామని స్కాట్జ్ తెలిపారు. ఇప్పటికే పరీక్షలు, తనిఖీలు పూర్తికాగా ఉత్పత్తి కోసం లైసెన్స్ పొందినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో తొలి బ్యాచ్‌ను అందించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.

క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ కార్బైన్స్ టెండర్‌లో భారత్ ఫోర్జ్ ప్రైమరీ బిడ్డర్ కాగా, తమ సంస్థ రెండో బిడ్డర్ అని తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసే దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఖరారవుతుందని ఆశిస్తున్నామని అన్నారు.


More Telugu News