ఇండిగోపై కేంద్రం కన్నెర్ర.. సీఈఓ తొలగింపు, భారీ జరిమానాకు యోచన..!

  • ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను తొలగించాలని కోరే అవకాశం!
  • పైలట్ల విశ్రాంతి నిబంధనల అమలులో గందరగోళం
  • భారీ జరిమానాతో పాటు విమానాల సంఖ్య తగ్గింపునకు యోచన
  • కొత్త నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం
  • సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పైలట్ల విశ్రాంతి సమయానికి సంబంధించిన కొత్త నిబంధనల అమలులో గందరగోళం సృష్టించి, దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని ఆ సంస్థను కోరాలని కేంద్రం యోచిస్తున్నట్లు స‌మాచారం.

ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను ఇవాళ‌ సాయంత్రం సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది.

పైలట్లకు సుదీర్ఘ విశ్రాంతి కల్పించేందుకు ఏవియేషన్ రెగ్యులేటర్ తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పైలట్ల సంఖ్యను ఇండిగో యాజమాన్యం తప్పుగా అంచనా వేసింది. దీంతో ఒక్కసారిగా పైలట్ల కొరత ఏర్పడి, దేశీయ సర్వీసులను నడపడంలో సంస్థ తీవ్రంగా విఫలమైంది.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది. మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News