ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌కు మంత్రి నారా లోకేశ్ బర్త్‌డే విషెస్

  • నేడు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ బ‌ర్త్‌డే
  • మాంచో ఫెర్రర్‌ సేవలు అమోఘమ‌న్న మంత్రి లోకేశ్‌
  • స్వచ్ఛమైన తెలుగుతో అనంతపురం వాసిగా కలిసిపోయారన్న లోకేశ్‌
  • పేదల జీవితాల్లో ఆర్డీటీ వెలుగులు నింపుతోందని ప్రశంస
రాయలసీమలో గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక రంగాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

"పేదల జీవితాల్లో వెలుగులు, రోగుల పెదవులపై చిరునవ్వు, విద్యా కాంతులు, క్రీడా వికాసం, మహిళా సాధికారతకు ఆర్డీటీ చిరునామాగా నిలిచింది" అని ప్రశంసించారు. మాంచో ఫెర్రర్ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ, అచ్చమైన అనంతపురం వాసిగా ప్రజలతో మమేకమయ్యారని ఆయన పేర్కొన్నారు.

మాంచో ఫెర్రర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని లోకేశ్‌ ఆకాంక్షించారు. ఆర్డీటీ మానవతావాద సేవలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక సేవలో మాంచో ఫెర్రర్, ఆర్డీటీ సంస్థల కృషి ఎంతో గొప్పదని ఆయన అభివర్ణించారు.


More Telugu News