టేకాఫ్ కు సిద్ధమైన విమానంలో మంటలు.. వీడియో ఇదిగో!

  • బ్రెజిల్‌ లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • విమానంలోని 180 మంది ప్రయాణికులకు తప్పిన ముప్పు
  • మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
బ్రెజిల్‌ లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై టేకాఫ్ కు సిద్ధమైన విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేసి మంటలను ఆర్పివేశారు. ఆ సమయంలో విమానంలో 180 మంది ఉన్నారని, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఎయిర్‌ బస్‌ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఇంతలో క్యాబిన్‌ లో మంటలు చెలరేగాయి. విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. ప్రయాణికులను సిబ్బంది దించేయగా, ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా, విమానంలో మంటలు చెలరేగలేదని, లగేజీ ఎక్కించే లోడర్‌ లో అగ్ని ప్రమాదం జరిగిందని లాటమ్‌ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


More Telugu News