నర్సంపేటలో రూ.532 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

  • రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
  • రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల
  • రూ.26 కోట్లతో నర్సింగ్ కాలేజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి, అభివృద్ధి పనులపై వరాల జల్లు కురిపించారు. ఈరోజు ఆయన రూ.532.24 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.26 కోట్లతో నర్సింగ్ కాలేజీ, పలు రోడ్ల విస్తరణ పనులు ఉన్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

"పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ఫాంహౌస్‌లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు కానీ, ఉద్యమగడ్డ వరంగల్‌కు ఏమీ చేయలేదు. వారు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేశారు" అని ఆయన మండిపడ్డారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని, తాము పేదల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మార్చి 31 లోగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు. 

Revanth Reddy
Telangana CM
Narsampet
Warangal
Telangana development
Congress government
BRS criticism
Farmer loan waiver
Indiramma houses
Warangal airport

More Telugu News