ఇండిగో దెబ్బ.. న్యూయార్క్ కంటే ముంబైకే టికెట్ ధర ఎక్కువ!
- ఇండిగోలో తీవ్ర సంక్షోభం.. 550కి పైగా విమానాల రద్దు
- టికెట్ ధరల మోతతో ప్రయాణికులపై పెను భారం
- న్యూయార్క్ కంటే ముంబై ప్రయాణానికే అధిక చార్జీల వసూలు
ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా సర్వీసులను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72, బెంగళూరులో 73, చెన్నైలో 39 సర్వీసులు ఉన్నాయి. ఉన్నపళంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఈ పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధర రూ.30 వేలు దాటింది. ఢిల్లీ నుంచి విజయవాడకు ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర రూ.34,987గా ఉంది. సాధారణంగా రూ.6-10 వేల మధ్య ఉండే ధరలు ఇంత భారీగా పెరగడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.