Sajjala Ramakrishna Reddy: కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన: సజ్జల

 Sajjala Ramakrishna Reddy Huge Response to Signature Campaign
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం
  • లక్ష్యం కంటే ఎక్కువ సంతకాలు వచ్చాయన్న సజ్జల
  • ఈ నెల 16న గవర్నర్‌కు సంతకాలను అందజేయనున్న జగన్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం' కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాలను లక్ష్యంగా పెట్టుకుంటే, అంతకుమించి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు సజ్జల వెల్లడించారు. ఈ మేరకు కార్యక్రమ షెడ్యూల్‌ను నేతలకు వివరించారు. నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10వ తేదీలోగా జిల్లా పార్టీ కార్యాలయాలకు, అక్కడి నుంచి 13న తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.

సంతకాలను పంపే ముందు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్రజలు, మీడియా ముందు ప్రదర్శించి, బాక్సుల్లో సర్ది పంపాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య నేతలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధినేత జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తరలించాలని చెప్పినట్టు సజ్జల పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. 
Sajjala Ramakrishna Reddy
YSRCP
Medical Colleges Privatization
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Signature Campaign
Protest
Government Medical Colleges
Governor
Tadepalli

More Telugu News