వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన.. అమెరికా సైనికురాలి మృతి, మరొకరి పరిస్థితి విషమం

  • వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ సైనికులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పులు
  • నిందితుడు గతంలో అమెరికాకు సహకరించిన ఆఫ్ఘన్ శరణార్థి
  • దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • ఉగ్రవాద కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభం
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో ఓ ఆఫ్ఘన్ జాతీయుడు జరిపిన కాల్పుల్లో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్‌కు చెందిన మహిళా సైనికురాలు మరణించగా, మరో సైనికుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా సైనికులతో ఫోన్‌లో మాట్లాడుతూ స్పెషలిస్ట్ సారా బెక్స్‌ట్రోమ్ (20) మరణించినట్లు ప్రకటించారు. స్టాఫ్ సార్జెంట్ ఆండ్రూ వోల్ఫ్ (24) పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రహ్మానుల్లా లకన్‌వాల్ (29)గా గుర్తించారు. అతడు ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలకు, సీఐఏకు సహకరించిన ప్రత్యేక సైనిక విభాగంలో పనిచేశాడు. బైడెన్ చేపట్టిన 'ఆపరేషన్ అల్లైస్ వెల్‌కమ్' కార్యక్రమం కింద 2021లో అమెరికాకు శరణార్థిగా వచ్చాడు.

ఈ ఘటనను ట్రంప్ ఉగ్రదాడిగా అభివర్ణించారు. నిందితుడిని క్రూరమైన రాక్షసుడిగా పేర్కొన్నారు. ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత అతడు మానసికంగా కుంగిపోయి పిచ్చివాడిగా మారాడని వ్యాఖ్యానించారు. అమెరికాకు సహకరించిన ఆఫ్ఘన్లకు ఆశ్రయం కల్పించే విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. 


More Telugu News