పెద్ద పేగు క్యాన్సర్‌కు పిప్పళ్లతో చెక్.. పరిశోధనలో కీలక ఆవిష్కరణ!

  • పిప్పళ్లలోని పిప్లార్టైన్‌తో క్యాన్సర్ కణాల నాశనం
  • కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం
  • ఎన్‌ఐటీ రూర్కెల శాస్త్రవేత్తల బృందం అధ్యయనం
మన వంటిళ్లలో సులభంగా కనిపించే మసాలా దినుసు పిప్పళ్లు (తోక మిరియాలు) ప్రాణాంతకమైన పెద్ద పేగు క్యాన్సర్‌ (కొలన్ క్యాన్సర్‌)ను నివారించగలవని తాజా పరిశోధనలో తేలింది. పిప్పళ్లలో సహజంగా లభించే 'పిప్లార్టైన్‌' (పైపర్‌లాంగమీన్‌) అనే రసాయనానికి క్యాన్సర్ కణాలను సమర్థంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రూర్కెలలోని ఎన్‌ఐటీ పరిశోధకులు, బిహార్ సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన బృందాలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుతం పెద్ద పేగు క్యాన్సర్‌కు కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై పరిశోధన చేస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఈ కీలక విషయాన్ని కనుగొన్నారు.

పిప్లార్టైన్‌ను పెద్ద పేగు క్యాన్సర్ కణాలపై ప్రయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక వరం లాంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ 'బయోఫ్యాక్టర్స్‌'లో ప్రచురించారు.


More Telugu News